(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట )
అస్సలా అలా అనుకోవద్దు . ఇది స్పానిష్ కాదు . ఇండియాలో ఉన్న రెండు ముఖ్యమైన క్యాబ్ సర్వీస్ లన మిక్సీలో వేస్తే వచ్చినదన్నమాట .క్యాబ్ ఎక్కినప్పుడు డ్రయివర్ పక్కన కూర్చుని వాళ్ళతో ఏదో పిచ్చాపాటి మాటాడం అలవాటు . రాత్రిళ్ళు లేదా తెల్లవారుజామున మాటాడకపోవటం ప్రాణాంతకం కూడా . ప్రతీ సారీ కనీసం ఒక ఆసక్తికరమైన లేదా ఆలోచన రేకెత్తించే నిజమైన కథ ఒకటైనా వింటాను . ఈసారి రెండు విన్నాను
మొదటిది మోతీనగర్ నుంచి కాచీగూడా రైల్వే స్టేషనుకి . ఇతను రావటమే ధూమ్ ధామ్ గా వచ్చారు . డోర్ తీసి లోపలి ఎక్కేలోపే ఒక వంద మాటలు నోట్లోంచి ప్రవాహంలా వచ్చేశాయి పక్కా హైద్రాబాదీ హిందీ లో . మరి మనదేమో "రఘుతాతా" విందీ కాబట్టి ముందే సెలవిచ్చా మహాప్రభూ నాది చుట్టీపాత్ర హిందీ అని . అయినా "ఫికర్ న కో " అని ఇంగ్లీషులో మొదలెట్టారు . ఈయన ముస్లిం . నలుగురు అమ్మాయిలు . ఇద్దరు అమ్మాయిలని డాక్టర్ చదివిస్తున్నారు . మూడో అమ్మాయి బి ఫార్మసీ చదువుతోంది . చివరి అమ్మాయి 8 తరగతి చదువుతుంది . కేవలం కారు నడుపుతూ ఇది ఎలా సాధ్యం అని అర్ధం వచ్చేలా అడిగితే ఇంకా చాలా పనులు చేస్తానని , వీలు దొరికినప్పుడల్లా ఇది కూడా అని , కేవలం చదువే తన పిల్లల భవిష్యత్తుని మారుస్తుందని , నేను ఇంత సరదాగా కనిపించినా , చదువు దగ్గర చాలా స్ట్రిక్ట్ అని , అది నా పిల్లలకి కూడా బాగా తెలుసని చెపుతా ఉంటే భలే ముచ్చట వేసింది . ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలకి ఆ లెవెల్లో ఉన్న ఎనర్జీ చూసి ఆశ్చర్యమేసింది .
రెండవది మోతీ నగర్ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెనక్కి రావటానికి . సాధారణంగా ఈ ప్రయాణం ఒకపక్క కర్మభూమిని వదిలి వెళ్ళిపోతున్నామని మనసంతా కకావికలమై ఉంటే, మరో పక్క మన ఇంటికి వెళ్ళిపోతున్నామనే ఆలోచన ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది . ఆపీసు గుర్తొచ్చి మనసంతా పిసికేసినట్టు ఉన్నా రెక్క ఆడించాలి కదా మరి డొక్కాడటానికి . ప్రయాణం రాత్రి కాబట్టి డ్రయివర్ని కదలించాను . ఇది మరో ఉత్తేజపూరితమైన నిజమైన కథ . జీవితం ఆటో నడపటంతో మొదలయ్యి , క్రమంగా ఎలా ఎదిగారో , ఈరోజు ఎన్ని ఆస్తులు సంపాదించారో , ఎన్ని రాత్రులు కుటుంభానికి దూరంగా , కుటుంభం గురుంచి గడిపారో చెప్పి ఏరోజు కూడా కష్టం కింద అనిపించలేదని , జీవితంలో ఎదుగుదల ఉండాలని చెప్పి , ఇదంతా తన సైడ్ బిజినెస్ అని పగలంతా ఒక డాక్టర్ దగ్గర పని చేస్తానని చెప్పేటప్పటికీ నాకైతే మతి పోయింది .
ఇదంతా సగం ప్రయాణం అయితే , మరో సగం చేతులెత్తి మొక్కే కథనం . వాళ్ళ నాయన 45 రోజులు క్రితం కాలం చేశారని చెప్పి , ఇంక తన గురుంచి చెప్పటం మానేసి వాళ్ళ నాయన గురుంచి మాత్రమే చెప్పారు . బహుశా ఆ అరగంటలో " మా నాయన" అనే పదం ఒక 500 సార్లు అని ఉంటారు . చాలా సార్లు గొంతుక బొంగురు పోయింది నాన్న గురుంచి చెపుతుంటే , కళ్ళలో సన్నటి తేమ పొర . చివరగా ఆయన "సార్ ..ఇంత కాలం నేను చాలా సాధించాను అనుకున్నాను కానీ మా నాయన పోయిన తర్వాత నేను ఏమీ కాదు సూన్యం అని తెలిసివచ్చింది " అని ఇంక ఏమీ మాట్లాడలేదు . నేను కూడా ఏమీ మాట్లాడించలేదు . అన్ని సంవత్సరాలు ఆయనకి అరగంట తెర మీద కనపడితే ,ఆ ఉద్వేగం చల్లబడటానికి ఆ మాత్రం సమయం అవసరం .
కన్న వారి మీద ప్రేమ, సంపదలలో ఉందో లేదా సంపదలతో సంభంధం లేని సంస్కారం లో ఉందో ..